You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
అసెంబ్లీ ఎన్నికలు -2026 : తమిళనాడు సీఎం స్టాలిన్ ఓటమి
తమిళనాడు ముఖ్యమంత్రి, డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ కొలత్తూరు అసెంబ్లీ నియోజకవర్గంలో ఓటమి పాలయ్యారు. టీవీకే అభ్యర్థి వీఎస్ బాబు 8,795 ఓట్ల మెజార్టీతో ఆయనపై విజయం సాధించారు. వీఎస్ బాబుకు 82,997 ఓట్లు రాగా, స్టాలిన్కు 74,202 ఓట్లు దక్కాయి.
సారాంశం
- తమిళనాడు, అస్సాం, కేరళ, పశ్చిమబెంగాల్ రాష్ట్రాలతోపాటు కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరి శాసనసభల ఎన్నికల ఫలితాలను ఆయా రాష్ట్రాలపై క్లిక్ చేసి తెలుసుకోండి.
- తమిళనాడులో సినీనటుడు విజయ్ టీవీకే పార్టీ దూసుకుపోతోంది. వందకుపైగా స్థానాలలో ఆధిక్యంలో ఉంది.
- పశ్చిమబెంగాల్లో బీజేపీ ఆధిక్యంలో ఉంది.
- కేరళలో యూడీఎఫ్ ముందంజలో ఉంది.
- కేరళలో కమ్యూనిస్టుల చివరి కోట పతనం అంచుకు చేరింది.
లైవ్ కవరేజీ
అమిత్ షాకు రాహుల్ గాంధీ లేఖ
దిల్లీలో నిరసన చేస్తున్న విద్యార్థులపై బలగాలను ప్రయోగించిన ఘటనకు బాధ్యత ఎవరిదని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ప్రశ్నించారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు ఆయన ఓ లేఖ రాశారు.
నిరసన చేస్తున్న ప్రజలను రక్షించడం, చర్చల ద్వారా వారి సమస్యలను పరిష్కరించడం ప్రభుత్వ బాధ్యత అని రాహుల్ గాంధీ అన్నారు.
"మా విద్యార్థులు నిష్పక్షపాతమైన, జవాబుదారీతనం ఉన్న విద్యా వ్యవస్థను కోరుతున్నారు. వారి మాట వినడానికి బదులుగా , భద్రతా దళాలు వారిపై బలప్రయోగం చేశాయి. ప్రాణాంతక ఆయుధాలు, టియర్ గ్యాస్ ప్రయోగించాయి. వందలాది మంది విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. మహిళా విద్యార్థులపైనా దాడి చేశారు. వారి ప్రైవేట్ పార్టులను ఉద్దేశపూర్వకంగా లక్ష్యంగా చేసుకుని కూడా దాడి చేశారు’’ అని ఆ లేఖలో రాహుల్ గాంధీ రాశారు.
"ప్రాణాంతకమైన పెల్లెట్ గన్లను ఉపయోగించడం అత్యంత దిగ్భ్రాంతికరమైన విషయం. ఒక జర్నలిస్టుతో సహా చాలా మంది తీవ్రంగా గాయపడ్డారని మీడియా, సోషల్ మీడియాలో కథనాలొచ్చాయి. నేను 19 ఏళ్ల విద్యార్థి సాహిల్ లోచాబ్ను కలిశాను.పెల్లెట్ గన్తో కాల్చడంతో ఆయనిప్పుప్పుడు తీవ్రమైన నొప్పితో బాధపడుతున్నారు. ఒక కన్ను కోల్పోయే ప్రమాదం కూడా ఉంది’’ అని రాహుల్ గాంధీ పేర్కొన్నారు.
లేఖలో రాహుల్ గాంధీ రెండు ప్రశ్నలు అడిగారు.
" విద్యార్థులపై పెల్లెట్ గన్లతో సహా ప్రాణాంతకమైన బలప్రయోగానికి హోం మంత్రిగా మీరు అనుమతిచ్చారా? ఒకవేళ మీరు కాకపోతే ఎవరు అనుమతిచ్చారు?
సాధారణ దుస్తుల్లో విద్యార్థులను లాఠీలతో కొడుతున్నట్టు కనిపించిన వారు పోలీసులా లేక వాలంటీర్లా? వారిని మోహరించడానికి ఎవరు అధికారం ఇచ్చారు?"
దేశ భవిష్యత్తు అయిన యువత, విద్యార్థులు ఈ ఘటనపై సమాధానాలు, జవాబుదారీతనం కోరుతున్నారని రాహుల్ గాంధీ లేఖలో రాశారు.
కాక్రోచ్ జనతా పార్టీ ఇంకా చాలా దూరం ప్రయాణించాల్సి ఉంది: అభిజిత్ దీప్కే
కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) ఆధ్వర్యంలో ఉద్యమంలో పాల్గొన్న వారందరికీ పార్టీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే కృతజ్ఞతలు తెలిపారు.
ఈ ఉదయం ఆయన ఓ వీడియో విడుదల చేశారు.
"మీ అందరి మద్దతు లేకుండా ఇది సాధ్యమయ్యేది కాదు. జంతర్ మంతర్ దగ్గర చివరి వరకు ఉన్నవారికి నిన్న వ్యక్తిగతంగా ధన్యవాదాలు చెప్పలేకపోయాను. దీనిపై మీ అందరికీ క్షమాపణలు చెబుతున్నా" అని వీడియోలో అభిజీత్ దీప్కే చెప్పారు.
"మీకు తెలిసినట్టే నాకు టైఫాయిడ్ వచ్చింది. నిన్న నాకు జ్వరం చాలా ఎక్కువ కావడంతో ఇంటికి వచ్చేశాను. 37 రోజుల పాటు జంతర్ మంతర్ దగ్గర పోరాటం కొనసాగించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈ దేశం కోసం మీరు చేసిన కృషిని నేను అభినందిస్తున్నాను" అని చెప్పారు.
ఉద్యమాన్ని విమర్శించిన వారికి కూడా అభిజిత్ దీప్కే కృతజ్ఞతలు తెలిపారు.
‘‘ 'మీరు సీరియస్గా లేరు, ఎలా నిరసన చేయాలో మీకు తెలియదు' అని మమ్మల్ని విమర్శించిన వారికి కూడా నేను ధన్యవాదాలు చెప్పాలనుకుంటున్నాను. మీరు మమ్మల్ని ప్రశ్నించకపోయి ఉంటే లోపాలను సరిదిద్దుకునే అవకాశం మాకు వచ్చేది కాదు" అని వీడియోలో మాట్లాడారు.
ఇది ఆరంభం మాత్రమేనని,కాక్రోచ్ జనతా పార్టీ ఇంకా చాలా దూరం ప్రయాణించాల్సి ఉందని ఆయన వ్యాఖ్యానించారు.
జంతర్ మంతర్ దగ్గర ఇప్పుడు ఎలా ఉందంటే....
కేంద్ర విద్యాశాఖ మంత్రిగా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడంతో దిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో సాగిన ఆందోళన శనివారం రాత్రి ముగిసింది.
నిరసనకారులు ఆ ప్రాంతాన్ని ఖాళీచేశారు. పోలీసుల మోహరింపు కొనసాగుతోంది.
అయితే ఇంతకుముందుతో పోలిస్తే ఇప్పుడు అక్కడ మోహరించిన పోలీసుల సంఖ్య బాగా తగ్గింది.
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు దారి తీసిన ఐదు కారణాలు ఇవేనా?
సముద్ర గర్భంలో దొరికిన 74 ఏళ్ల కిందటి విమాన ప్రమాద శకలాలు, నేటి సేఫ్టీ నిబంధనలకు ఈ యాక్సిడెంటే కారణమంటారు, ఎందుకంటే..
మనం మళ్లీ కలుస్తాం - ధర్మేంద్ర ప్రధాన్ను ఉద్దేశించి కొత్త విద్యాశాఖా మంత్రి ప్రహ్లాద్ జోషీ వ్యాఖ్యలు
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా అనంతరం కేంద్ర విద్యాశాఖ బాధ్యతలు తనకు అప్పగించడంపై ప్రధాని మోదీకి ప్రహ్లాద్ జోషి ధన్యవాదాలు చెప్పారు.
‘‘మోదీ ప్రభుత్వం గత పన్నెండేళ్లలో ఎన్నో చరిత్రత్మక విజయాలు సాధించింది. ప్రధాని మార్గదర్శకత్వంలో నా పూర్తి సామర్థ్యంతో పనిచేయడానికి ప్రయత్నిస్తా’’అని ప్రహ్లాద్ జోషి చెప్పారు.
‘‘ధర్మేంద్ర ప్రధాన్ రాజకీయ ప్రస్థానం అనేక దశాబ్దాలనుంచి సాగుతోంది. దేశాభివృద్ధి విషయంలో ఆయన నిబద్ధత ఎప్పటికీ గుర్తుండిపోతుంది. తన పదవీకాలంలో ధర్మేంద్ర ప్రధాన్ నూతన విద్యావిధానాన్ని విజయవంతంగా అమలుచేశారు. విద్యారంగంలో వందకు పైగా చిన్నా,పెద్దా సంస్కరణలు ప్రవేశపెట్టారు. జాతీయ ప్రయోజనాలకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ ఆయన పదవి నుంచి వైదొలిగినప్పటికీ, దేశాభివృద్ధికి ఆయన చేసిన సేవను అది మరుగునపడనివ్వదు. దేశ అభివృద్ధి మార్గంలో మనం మళ్లీ కలుస్తాం’’ అని ప్రహ్లాద్ జోషి ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు.
బీజేపీ కార్యకర్తలకు పదవి కన్నా దేశం ముఖ్యం: అమిత్ షా
దేశ యువత మనోభావాలను మోదీ ప్రభుత్వం గౌరవిస్తుందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా అన్నారు. ప్రశ్నాపత్రాల లీకులను అరికట్టేందుకు అవసరమైన సంస్కరణలు తీసుకురావడానికి కేంద్రం కట్టుబడి ఉందని శనివారం రాత్రి అమిత్ షా ‘ఎక్స్’లో రాశారు.
బీజేపీ కార్యకర్తలకు పదవి కన్నా దేశం, యువత, విద్యార్థులే ముఖ్యమని, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా దీనికి నిదర్శనమని అమిత్ షా పోస్ట్ చేశారు.
ప్రశ్నాపత్రాల లీకేజ్కు బాధ్యులైనవారికి కఠిన శిక్ష పడేలా ప్రధాని మోదీ తీసుకున్న చర్యలు ప్రశంసనీయమని అమిత్ షా అన్నారు. ప్రధాని చర్యలు నీట్లో ఉత్తీర్ణులైన విద్యార్థులకు సంపూర్ణ న్యాయం అందిస్తాయని తనకు నమ్మకముందని అమిత్ షా తెలిపారు.
‘‘తన పదవీకాలంలో ధర్మేంద్ర ప్రధాన్ జాతీయ విద్యావిధానాన్ని సమర్థవంతంగా అమలు చేయడం, మాతృభాషలో పరీక్షలు నిర్వహించడం, పీఎం శ్రీ పాఠశాలల విస్తరణ, డిజిటల్ విద్యను ప్రోత్సహించడం, నైపుణ్యాభివృద్ధి, పరిశ్రమ-విద్యాసంస్థల సమన్వయాన్ని బలోపేతం చేయడం వంటి అంశాల్లో కీలక సంస్కరణలు చేపట్టారు. పరీక్షా విధానాన్ని విద్యార్థి కేంద్రీకృతంగా, మరింత సమగ్రంగా తీర్చిదిద్దేందుకు ఆయన చేసిన కృషి ప్రశంసనీయం’’ అని అమిత్ షా తన పోస్టులో రాశారు.
బీబీసీ తెలుగు లైవ్ పేజ్కు స్వాగతం
నేను బీబీసీ ప్రతినిధి కమలాదేవి నల్లపనేని.
ఇప్పటి నుంచి మధ్యాహ్నం 2గంటల వరకు ముఖ్యమైన వార్తలను లైవ్ పేజ్ ద్వారా మీకు అందిస్తాను.
నిన్నటి లైవ్ పేజ్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా: ఇది మోదీ ప్రభుత్వానికి ఎదురుదెబ్బా లేక ఒక పెద్ద అవకాశమా?
కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషికి విద్యా శాఖ బాధ్యతలు
కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషికి విద్యా శాఖ అదనపు బాధ్యతలు చేపట్టనున్నారు.
కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో ఆ శాఖ బాధ్యతలను జోషీకి అప్పగిస్తూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆదేశాలు జారీ చేసినట్లు రాష్ట్రపతి డిప్యూటీ ప్రెస్ సెక్రటరీ ఒక ప్రకటనలో తెలిపారు.
ప్రధాన మంత్రి మోదీ సూచనల మేరకు, విద్యా శాఖ అదనపు బాధ్యతలను ప్రహ్లాద్ జోషీకి అప్పగిస్తూ రాష్ట్రపతి నిర్ణయం తీసుకున్నారని పేర్కొన్నారు.
జోషి ప్రస్తుతం కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజా పంపిణీ శాఖల మంత్రిగా ఉన్నారు. ఆయన వద్దే పునరుత్పాదక ఇంధన శాఖ పోర్ట్ఫోలియో కూడా ఉంది.
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాను ముర్ము అధికారికంగా ఆమోదించినట్లు ఆ ప్రకటనలో పేర్కొన్నారు.
సీజేపీ అన్ని డిమాండ్లకు ప్రభుత్వం సంపూర్ణంగా అంగీకరించిందా, బాధిత కుటుంబాలకు పరిహారం గురించి ఏం చెప్పారు?
'మనం అనుకున్నది సాధించాం' - అభిజీత్ దీప్కే
జంతర్ మంతర్ వద్ద యువత సంబరాలు, 9 ఫోటోల్లో...
'డిమాండ్లు సాధించాం, దీక్ష ముగిసింది', నిరసనకారులు క్షేమంగా ఇళ్లకు వెళ్లాలని సీజేపీ విజ్ఞప్తి
తమ మిగిలిన డిమాండ్లను కేంద్ర ప్రభుత్వం అంగీకరించిందని కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) తెలిపింది.
మూడో విడత చర్చల అనంతరం, కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, జితేంద్ర సింగ్లతో కలిసి సీజేపీ అధికార ప్రతినిధులు సౌరవ్ దాస్, అశుతోష్ రాంకా మీడియా సమావేశంలో మాట్లాడారు.
"ప్రభుత్వం మన డిమాండ్లు అన్నింటినీ అంగీకరించింది. దీక్ష ముగిసింది, నిరసనకారులు క్షేమంగా ఇళ్లకు వెళ్లాలి" అని వారు విజ్ఞప్తి చేశారు.
"ప్రభుత్వం ఇతర డిమాండ్లను కూడా అంగీకరించింది" అని సీజేపీ అధికార ప్రతినిధి సౌరవ్ దాస్ మీడియా సమావేశంలో తెలిపారు.
"కేవలం దిల్లీలోనే కాకుండా దేశవ్యాప్తంగా నమోదైన ఎఫ్ఐఆర్లను ఉపసంహరించుకునేందుకు ప్రభుత్వం అంగీకరించింది. నిరసనల్లో పాల్గొన్నందుకు భవిష్యత్తులో ఏ సీజేపీ కార్యకర్తపైనా చర్యలు తీసుకోబోమని కూడా ప్రభుత్వం హామీ ఇచ్చింది" అని ఆయన అన్నారు.
బాధిత కుటుంబాలకు కోటి పరిహారంపై కూడా అంగీకారం కుదిరిందని, చట్టప్రకారం పరిహారం చెల్లిస్తామని ప్రభుత్వం చెప్పిందని అశుతోష్ రాంకా తెలిపారు.
మీడియా సమావేశంలో కేంద్ర మంత్రి జేపీ నడ్డా మాట్లాడుతూ, కాక్రోచ్ జనతా పార్టీ ప్రతినిధుల డిమాండ్లన్నింటినీ ప్రభుత్వం సానుభూతితో పరిశీలించిందని, అంగీకరించిందని అన్నారు.
"ఈ రోజు మేం సుదీర్ఘంగా చర్చలు జరిపాం. ప్రస్తుతం నమోదైన కేసులకు సంబంధించి నాలుగు అంశాలతో కూడిన ఒక లిఖితపూర్వక ముసాయిదాను వారు తీసుకువచ్చారు. వాటితో పాటు, మిగిలిన రెండు డిమాండ్లపై కూడా మేం చర్చించాం. ఎలాంటి ప్రతీకార చర్యలు తీసుకోకూడదు, పరిహారం అందించాలి, అలాగే వారి ఐదు అంశాల చార్టర్ను పరిగణించడం.
మేమే వారికి ఎఫ్ఐఆర్ల కాపీలను అందిస్తాం, ఎలాంటి చర్యలు తీసుకోబోం. రెండో విషయానికి వస్తే.. పరిహారంపై ప్రభుత్వం స్పష్టంగా చెప్పింది, మాకు కూడా సానుభూతి ఉంది. నిబంధనల ప్రకారం పరిహారం ఉంటుందని, సాధ్యమైనంత గరిష్టంగా వారికి అందిస్తామని మేం చెప్పాం" అని పేర్కొన్నారు.
పాకిస్తానీ సోషల్ మీడియా అకౌంట్లతో తప్పుడు ప్రచారం : దిల్లీ పోలీసులు
పాకిస్తాన్ నుంచి నడుస్తున్న కొన్ని సోషల్ మీడియా అకౌంట్లు ఈ నిరసనలకు సంబంధించి నకిలీ వార్తలను, పూర్తిగా తప్పుదోవ పట్టించే సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్నాయని దిల్లీ సెంట్రల్ డీసీజీ రోహిత్ రాజ్బీర్ సింగ్ అన్నారు.
సీజేపీ నిరసనలకు సంబంధించి ఏర్పాటు చేసిన ప్రెస్ కాన్ఫరెన్సులో ఆయన మాట్లాడారు.
ఏజెన్సీల సహకారంతో అలాంటి అకౌంట్లను గుర్తించి, వాటిపై చర్యలు చేపట్టే పనిలో ఉన్నట్లు ఆయన చెప్పారు. ‘‘పాకిస్తాన్కు చెందిన కొన్ని సోషల్ మీడియా అకౌంట్లు ఈ నిరసనలకు సంబంధించి తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్నట్లు దర్యాప్తులో తేలింది. ఇలాంటి మరిన్ని అకౌంట్లను గుర్తించేందుకు సంబంధిత ఏజెన్సీలతో కలిసి దిల్లీ పోలీసులు పనిచేస్తున్నారు’’ అని డీసీపీ తెలిపారు.
‘‘ఇప్పటి వరకు అలాంటి 400కి పైగా సోషల్ మీడియా హ్యాండిల్స్ను గుర్తించి, బ్లాక్ చేశాం. ఈ అకౌంట్లు నిరసనలకు సబంధించి ఏఐ-జనరేట్ చేసిన కంటెంట్ను, డీప్ఫేక్ వీడియోలను, ఎడిట్ చేసిన చిత్రాలను, ఇతర తప్పుదోవ పట్టించే కంటెంట్ను వ్యాప్తి చేస్తున్నాయి’’ అని చెప్పారు.
'ఆపరేషన్ సింధూర్' సమయంలో కూడా ఈ హ్యాండిల్స్లో కొన్ని తప్పుదోవ పట్టించే సమాచారాన్ని వ్యాప్తి చేయడంలో చురుగ్గా పనిచేసినట్లు దర్యాప్తులో తేలిందన్నారు.
‘‘ఈ సోషల్ మీడియా అకౌంట్లు పలువురు సీనియర్ అధికారుల అధికారిక ప్రకటనలను తారుమారు చేసి, వక్రీకరించాయి. అలాగే, విజువల్ కంటెంట్ను మార్చేసి ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నించాయి’’ అని ఆయన చెప్పారు.
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాపై ప్రతిపక్షాలు ఏమన్నాయంటే..
కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాను ప్రతిపక్ష నాయకులు స్వాగతించారు. ఇది యువత నేతృత్వంలో సాగిన ఉద్యమ విజయంగా అభివర్ణించారు.
ఇది "దేశవ్యాప్తంగా విద్యా వ్యవస్థలో మార్పులు చేయాలని కోరుతూ వీధుల్లోకి వచ్చిన మన లక్షలాది మంది యువత సాధించిన విజయం" అని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అన్నారు.
ఎన్సీపీ(ఎస్పీ) అధినేత శరద్ పవార్ దీనిని, "దేశ యువత సమైక్య బలంతో సాధించిన ఒక భారీ విజయంగా అభివర్ణించారు. ఆయన ఎక్స్ పోస్టులో "అణచివేతకు భయపడకుండా అన్యాయానికి వ్యతిరేకంగా యువత బలంగా నిలబడి, ప్రభుత్వం నైతిక బాధ్యత వహించేలా చేసిన ఈ పోరాటం. ప్రజాస్వామ్య బలానికి నిదర్శనంగా నిలుస్తుంది" అని రాశారు.
ఇది "యువత సాధించిన పెద్ద విజయం" అని సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ అన్నారు. అయితే, భవిష్యత్తులో పేపర్ లీక్లను అరికట్టడానికి, పరీక్షా విధానాలను బలోపేతం చేయడానికి ఈ ఘటన అన్ని రాజకీయ పార్టీలకు ఒక పాఠంగా ఉపయోగపడాలని అభిలషించారు.
ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు అరవింద్ కేజ్రీవాల్ కూడా దీనిని "ప్రజాస్వామ్యానికి దక్కిన భారీ విజయం"గా అభివర్ణించారు.
ఇది భారత యువత సాధించిన విజయం : ప్రియాంక గాంధీ
కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాపై కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ వాద్రా స్పందించారు.
‘‘నాకు చాలా సంతోషంగా ఉంది. అయితే, నేనింత సంతోషంగా ఉండడానికి ప్రధాన కారణమేంటంటే.. రాజ్యాంగాన్ని నాశనం చేసేందుకు ప్రయత్నించిన, మన ప్రజల గొంతుకలను అణచివేసేందుకు, తొక్కేసేందుకు సాధ్యమైన అన్ని ప్రయత్నాలు చేసిన వారి నుంచి దేశ ప్రజలు తమ దేశాన్ని తిరిగి స్వాధీనం చేసుకునే ప్రక్రియను ఇప్పుడే ప్రారంభించారని నేను బలంగా విశ్వసిస్తున్నా.
ఇది భారత యువత సాధించిన విజయమని నా ప్రగాఢ విశ్వాసం. ప్రతి ఒక్కరి పట్ల నాకెంతో గర్వంగా ఉంది. బయటికి వచ్చి, వారు నమ్మిన దానిపై గట్టిగా నిలబడిన ప్రతి ఒక్కరూ.. మనకు మహాత్మా గాంధీ చూపిన మార్గంలోనే నడిచారు. వారు పూర్తిగా అహింసా మార్గంలోనే పోరాడారు. వారిపై పెల్లెట్ గన్లు ప్రయోగించారు. టియర్ గ్యాస్ వాడారు. లాఠీలతో కొట్టారు. తీవ్రంగా గాయపడినప్పటికీ.. వారెక్కడా లొంగలేదు. బదులుగా ప్రభుత్వమే వారి సంకల్పానికి తలవంచాల్సి వచ్చింది.
ఇది ఈ దేశపు పాలకులందరికీ.. ప్రస్తుత, భవిష్యత్ తరాల వారికి కూడా గుణపాఠం. ప్రజల ఆకాంక్షలను మీరు విని తీరాల్సిందే. ఇది ప్రజాస్వామ్యం. ప్రజల సంకల్పమే అత్యున్నతమైనది. దానికంటే మించినది ఏదీ లేదు. ఏ ఒక్క మనిషి, ఏ ఒక్క నేత, ఏ ఒక్క నియత, ఏ శక్తీ కూడా భారత ప్రజల సంకల్పాన్ని ఆపలేదు. నేడు మన యువత, విద్యార్థులు దీన్ని నిరూపించారు’’ అని ప్రియాంక గాంధీ అన్నారు.
ధర్మేంద్ర ప్రధాన్: ఒకప్పుడు పేపర్ లీకేజీకి వ్యతిరేకంగా లాఠీ దెబ్బలు తిన్న వ్యక్తి.. ఇప్పుడు అదే వ్యవహారంలో రాజీనామా, విద్యార్థి నేత నుంచి కేంద్ర మంత్రి వరకు..
ఇది ప్రజాస్వామ్య విజయం: సోనమ్ వాంగ్చుక్
కేంద్ర మంత్రి పదవికి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాను ప్రజాస్వామ్యం సాధించిన విజయంగా సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్ చుక్ అభివర్ణించారు.
ఆయన ఎక్స్ పోస్ట్లో “ఇది ప్రజాస్వామ్యం సాధించిన విజయం. ప్రత్యక్ష ప్రజాస్వామ్యం.. నేరుగా వీధుల నుంచే సాధించిన విజయం. శాంతి, ఓర్పు, పట్టుదల సాధించిన విజయమిది. సీజేపీకి, జెన్ జెడ్కు అభినందనలు. భయాన్ని వీడి, దేశం నలుమూలల నుంచి కదిలివచ్చిన పౌరులందరికీ ధన్యవాదాలు. ఇక జవాబుదారీతనంతో.. సంస్కరణల వైపు అడుగులు వేద్దాం” అని ఆయన రాశారు.