కేంద్ర మంత్రులతో ముగిసిన సీజేపీ చర్చలు, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా సహా ఇతర అంశాలపై ఎవరేమన్నారంటే..

ఫొటో సోర్స్, PTI
దిల్లీలోని కాన్స్టిట్యూషన్ క్లబ్లో కేంద్ర మంత్రులు, సీజేపీ ప్రతినిధుల మధ్య శుక్రవారం జరిగిన చర్చలు ముగిశాయి. ఈ చర్చలు దాదాపు రెండు గంటలపాటు సాగాయి.
అనంతరం కాక్రోచ్ జనతా పార్టీ ప్రతినిధి అశుతోష్ రాంకా మాట్లాడుతూ, ప్రభుత్వం రేపు మధ్యాహ్నం వరకూ సమయం కోరిందని అన్నారు.
ప్రభుత్వం తరఫున చర్చలకు వచ్చిన కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, జితేంద్ర సింగ్లతో సమావేశం అనంతరం సీజేపీ అధికార ప్రతినిధి ఏఎన్ఐతో మాట్లాడారు."ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలన్న మా డిమాండ్పై రేపు మధ్యాహ్నం వరకు గడువు ఇవ్వాలని ప్రభుత్వం కోరింది. ప్రభుత్వం త్వరలోనే ఆయన్ను పదవి నుంచి తొలగిస్తుందని ఆశిస్తున్నాం. నీట్ పేపర్ లీక్ కారణంగా ఆత్మహత్య చేసుకున్న అభ్యర్థుల కుటుంబాలకు నష్టపరిహారం, విద్యార్థులపై నమోదైన కేసుల ఉపసంహరణ డిమాండ్లకు ప్రభుత్వం సూత్రప్రాయంగా ఆమోదం తెలిపింది" అని అన్నారు.
మరోవైపు, సీజేపీ ప్రతినిధులతో భేటీ అనంతరం కేంద్ర మంత్రి జేపీ నడ్డా మాట్లాడుతూ, "మా సమావేశం దాదాపు రెండు గంటల పాటు కొనసాగింది. వారు మూడు ప్రధాన డిమాండ్లు మా ముందుంచారు. పరీక్షల సంస్కరణలకు సంబంధించి మరో ఐదు సూచనలు చేశారు. వీటిపై ప్రభుత్వంతో చర్చించి, వివరాలు తెలియజేసేందుకు రేపు మధ్యాహ్నం మరోసారి సమావేశమవుతామని వారికి చెప్పాం" అని అన్నారు.






